ఏకోన త్రింశా2ధ్యాయము
అనంతరము అంబరీషుడు దుర్వాసునికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడను. ఆకలితో వుండి అన్నానికైనా ఇంటికి వచ్చిన నిన్ను అలసటపాలు చేసిన మందభాగ్యుడను. అయినా నాయందు దయతో మరల నా ఇంటికి అతిథిగా వచ్చితివి. దయచేసి నా ఇంత విందారగించి, నా సర్వదోషాలనూ ఉపశమింప చెయ్యి అని ప్రార్ధించాడు. దుర్వాసుడు అంబరీషుడిని తన బాహువులతో లేవనెత్తి 'రాజా! ప్రాణదాతను తండ్రి అంటారు. ఇప్పుడు నువ్వు నా ప్రాణాలను కాపాడటం వలన నాకు పితృస్థానీయుడవయ్యావు. నిజానికి నేనే నీకు నమస్కరించాలి. కాని బ్రాహ్మణుడనూ, తాపసినీ, నీ కన్నా వయోవృద్దుడినీ అయిన కారణంగా నా నమస్కారం నీకు కీడు కలిగిస్తుందేగాని మేలు చేయదు. అందువల్ల నీకు నమస్కరించడం లేదని యేమీ అనుకోవద్దు. నేను నిన్ను కష్టపెట్టాను. అయినా నువ్వు నాకు ప్రాణభిక్షను పెట్టావు. నీ వంటి ధర్మాత్మునితో కలిసి భోజనమును చేయడం మహాభాగ్యం" అని చెప్పి, అతని ఆతిధ్యాన్నీ స్వీకరించి, విష్ణుభక్తుల మహాత్మ్య ప్రకటానార్ధం, పరీక్షకునిగా వచ్చిన దూర్వాసుడు ఆ సత్కార్యం పూర్తి కావడంతో తన ఆశ్రమానికి తరలి వెళ్లిపోయాడు. కాబట్టి, కార్తీక శుద్ధ ఏకాదశినాడు ఉపవాస జాగరణలు చేసి - ద్వాదశినాడు దానాదులను (క్షీరాబ్దిద్వాదశీ వ్రతం) నిర్వర్తించి, బ్రాహ్మణ సమేతుడై, ద్వాదశి ఘడియలు దాటకుండా పారణం చేయడంవల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఈ పుణ్యగాథను చదివినా, చదివించినా, వ్రాసినా, వినినాకూడా ఇహంలో సర్వసౌఖ్యాలనూ పొంది, పరంలో ఉత్తమ పదాన్ని పొందుతారు.
ఏవం శ్రీ స్కాంద పురాణా౦తర్గత కార్తీక మహాత్మ్యేమందలి
ఏకోన త్రింశోధ్యాయ స్సమాప్తః (ఇరువది తొమ్మిదవ అధ్యాయము)
No comments:
Post a Comment