కన్యాదాన ఫలము:
వశిష్ట ఉవాచ : రాజా! యెంతచెప్పినా తరగని ఈ కార్తీక మహత్మ్య పురాణములో కార్తీక మాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వానిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా _ నా తండ్రియైన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను.
జనక రాజేంద్రా! ఈ కార్తీక మాసంలో కన్యాదాన, ప్రాతః స్నానములు, యోగ్యుడైన బ్రాహ్మబాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్రదాన, అన్నదానములు __ ఇవి చాలా ప్రధానమైనవి. ధనముచేత పెదవాడూ, గుణముచేత యోగ్యుడూయైన బ్రాహ్మణా కుమారునికి - కార్తీకమాసములో వడుగుచేయించి దక్షిణను సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు గూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రీ జపమువల్ల దాతయొక్క పంచమాహాపాతకాలూ నశించిపోతాయి. వంద రావిచెట్లు నాటించినా, వందతోటలను వేయించినా , వంద నూతులను __ దిగుడుబావులనూ నిర్మించినా, పది వేల చెరువులను త్రవ్వించినా వచ్చే పుణ్యమెంతయితే ఉంటుందో, అది పేదబ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో పదహారోవంతుకు కూడా సమానము కాదు. ముఖ్యమైన విషయమును గుర్తుంచుకో.
శ్లో|| మాఘ్యాం వైమాధవేమాసి చోత్తమం మౌంజి బంధనం
కారయిష్యంతి తే రాజన్ దానం దత్వాతు కార్తీకే ||
కార్తీకంలో ఉపనయన దానమునుచేసి తడుపరిని వచ్చే మాఘములోగాని, వైశాఖములో గాని ఉపనయనమును చేయించాలి. సాధువులూ, శ్రోత్రియులూయైన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనమును చేయించడం వలన అనంతపుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పమును చెప్పుకుని ఫలానావారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తాను __ అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో.
జనక నరపాలా! ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ, బ్రాహ్మణ సమారాధనలూ వీని వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా! కార్తీకములో, తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో బాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పణ్యము మరింతగా ఇనుమడిస్తుంది.
శ్లో|| కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్భక్తితో 2 నఘ
స్వయంపాపై ర్వినుర్ముక్తః పితృణా౦ బ్రహ్హణః పదమ్ ||
కార్తీకములో కన్యాదాన మాచరించినవాడు స్వయముగా వాడు తరించడమే, గాక, వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనంగా ఒక ఇతిహాసమును చెబుతాను విను.
సువీరోపాఖ్యానము
ద్వాపర యుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజు వుండేవాడు. లేడికన్నుల వంటి సోగ కన్నులుగల సుందరాంగి యొకరై అతని భార్యగా వుండేది. దైవ యోగము వలన __ సువీరుడు, దాయాదులచే ఓడింపబడినవాడై, రాజ్యభ్రష్టుడై, అర్ధాంగియైన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి, కందమూలదులతో కాలము గడుపుకోసాగాడు. ఇలా వుండగా, అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలనే అతని రాణి ఒక చక్కటి కూమార్తెను ప్రసవించింది. స్వరసంపదలూ శత్రువుల పాలైపోవడం' తాను అడవుల పాలవడం, కందమూలాలతో బ్రతుకుతూన్న ఈ రోజుల్లో కడువుపండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వయినా లేని దరిద్రము - వీటన్నిటినీ పదేపదే తలచుకుంటూ తన పురాకృత కర్మలని నిందించుకుంటూ అతికష్టం మీద ఆ ఆడకూతురిని పెంచుకోసగారు సువీరదంపతలు. కాలగమనములో సువీరుని కూతురు చక్కగా యెదిగి నిజరూప లావణ్య సౌందర్యదులతో - చూసే వారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. ఎనిమిదేండ్ల ప్రాయంలోనే యెంతో మనోహరముగా వున్న ఆమెని చూసి, మోహితుడైన ఒక ముని కుమారుడు __ ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు 'ఋషిపుత్రా ! ప్రస్తుతము నేను ఘోరదరిద్రముతో వున్నాను గనుక- నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను' అన్నాడు. ఆ పిల్లమీది మక్కువ మానుకోలేని ముని బాలకుడు __ రాజా! నేను కేవలం మునికుమారుడినైన కారణముగా నీ వడిగినంత ధనమును తక్షణమే యివ్వలేను. తపస్సు చేత, తద్వారా ధనమును సంపాదించి తెచ్చి యిస్తాను. అంతవరకూ ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరచి వుంచు" అని చెప్పా, అందుకు, సువీరుడంగీకారించడంతో ఆ నర్మదాతీరములోనే తపోనిష్ఠుడై, తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి, దానిని తెచ్చి సువీరుని కిచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు' తమ యింటి ఆచారము ప్రకారముగా తన కూతురు నా ముని యువకున కిచ్చి ఆ ఆరణ్యములోనే కల్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక, భర్తతో కలసి వెళ్ళిపోయింది. తత్కన్యా విక్రమ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా వుండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్బిణియై మళ్లా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్దపిల్లను అమ్మిధనమును రాబట్టినట్టే __ ఈ పిల్లద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదింఛవచ్చునని __ సంతోషించాడు. బిడ్డ యెదుగుతూ వుంది, ఇదిలా వుండగా
ఒకానొక యతీశ్వరుడు నర్మదా స్నానానికై వచ్చి, అక్కడి పర్ణశాలలో వున్న సువీరుని, అతని భార్యనూ, కూమార్తెనూ చూసి __"ఓయీ! నేను కౌండిన్య గోత్రజుడనైన యతిని __ ఈ అరణ్య ప్రాతంలో సంసారయుతగా వున్న నువ్వేవరివి? అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నలకు జవాబుగా __ అయ్యా! నేను వంగదేశాధీశుడనైన సువీరుడను. దయాదుల వలన రాజ్యభ్రష్టుడనై యిలా అడవిలో జీవిస్తున్నాను.
శ్లో|| న దారిద్ర్య సమం దు:ఖం | నాశోకః పుత్రామారణాత్
న చవ్య ధానుగమనేన వియోగః ప్రియాపహత్ ||
దరిద్రంకన్నా ఏడిపించేదీ __ కొడుకు చావు (లేకపోవడం) కంటే ఏడవలసినదీ __ భార్యా ( రాజ్యం, భార్యా) వియోగం కన్నా బయటకు ఏడవలేని అంతశ్శల్యంలాంటి దు:ఖం- ఇంకేమీ వుండదు. తమకు తెలిసినదే గదా! ప్రస్తుతం నేనా విధమైన మూడు రకాల విచారాల వలనా అమితదుఃఖితుడనై __ ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుచున్నాను. ఈ అరణ్యములోనే తొలిచూలుగా నాకోక కూతురు పుట్టినది. ఆమె నొక మునికుమారునికి విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బ్రతుకుతున్నాను. ఇది నా రెండవకూతురు. ఈమె నా భార్య, నాగురించి ఇంకా ఏ వివరాలు కావాలో అడిగితే చెబుతాను" అన్నాడు సువీరుడు
సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు "ఓ రాజా! ఎంత పని చేశావు? మూర్ఖుడవై అగణితమైన పాపాన్నీ పోగు చేసి పెట్టుకున్నావు.
శ్లో|| కన్యా ద్రవ్యేణ యో జీవే దసిపత్రం సగచ్ఛతి
దేవాన్ ఋషీన్ పితౄన్ క్యాపి కన్యా ద్రవ్యేణ తర్పయేత్
శాపం దాస్యంతి తే సర్వే జన్మజన్మ న్యపుత్రతామ్ ||
ఆడపిల్లను అమ్ముకునే అలా వచ్చిన డబ్బుతో జీవించేవారు, మరణాంతాన __ 'అసిపత్రం' అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగుణాలను చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ దేవ ఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవి చూస్తారు. అంతే గాదు __ కర్తకు జన్మజన్మలకూ కూడా పుత్రసంతానము కలకూడదని శపిస్తారు. ఇక, అలా ఆడపిల్లల నమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు - ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు __ రాజా!
శ్లో || సర్వేషా మేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భుధా:
కన్యావిక్రయ శీలస్య ప్రాయశ్చిత్తం న చోదితమ్ ||
అన్ని రకాల పాపాలకూ ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలున్నాయి గాని, ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లనమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్రములోనూ కూడా యెటువంటి ప్రాయశ్చిత్తమూ లేదు.
కాబట్టి, సువీరా! ఈ కార్తీకమాసములో శుక్లపక్షంలో, నీ రెండవ కూమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణం జరిపించు. కార్తీకమాసములో విద్యాతేజశ్శీలయుక్తుడైన వరునికి కన్యాదనమును చేసినవాడు __ గంగాది సమస్త తీర్దాలలోనూ స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని, యధోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాళ్ళు పొందే సత్ఫలాన్నీ పొందుతాడు" అని హితభోధ చేశాడు.
కాని, నీచబుద్దితో కూడుకొనిన సువీరుడు, ఆ సజ్జన సద్భోధను కొట్టిపారేస్తూ __ "బాగా చెప్పావయ్యా బాపడా! పుట్టినందుకు గాను __ పుత్రదారా గృహ, క్షేత్ర వాసోవసు రత్నాద్యలంకారాదులతో యీ శరీరాన్ని పుష్టిపరచి సుఖించాలేగాని, ధర్మము __ ధర్మము అంటూ కూర్చుంటే యెలాగా? అసలు ధర్మమంటే యేమిటి? దానమంటే యేమిటి? ఫలమంటే యేమిటి? పుణ్యలోకాలంటేయేమిటి? అయ్యా ఋషిగారూ! యేదోరకంగా డబ్బును సంపాదించి భోగాలు అనుభవించడమే ప్రధానము. పెద్ద పిల్ల విషయములో కంటె అధికముగా ధనమిచ్చేవానికే నా చిన్నపిల్లని కూడా పెండ్లిచేసి __ నేను కోరుకునే సుఖబోగాలన్నీ అనుభవిస్తాను. అయినా- నా విషయాలన్నీ నీకెందుకు? నీ దారిన నువ్వెళ్ళు- "అని కసిరికొట్టాడు అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు.
శత్రుకీర్త్యు పాఖ్యాసము
ఈ సువీరుని పూర్వీకులలో శత్రుకీర్తీ అనే రాజోకడున్నాడు. సమస్త సద్దర్మప్రవక్తా, శతాధిక యాగాకర్తా అయిన ఆ శత్రుకీర్తి పుణ్యకార్యాల వలన స్వర్గములోని నింద్రాదులచేత గౌరవింపబడుతూ, సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు.
సువీరునికి __ యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి __ అక్కడ సుఖిస్తున్న శత్రుకీర్తి యొక్క జీవుని పాశబుద్ధుని చేసి __ నరకానికి తీసుకుని వచ్చారు. ఆ చర్యకు కాశ్చర్యపడిన శత్రుకీర్తి యముని ముంగిట నిలబడి స్వర్గములో వున్న నన్ను యిక్కడెందుకు రప్పించావు? నేను చేసిన పాపమేమిటి?' అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు 'శత్రుకీర్తి! నువ్వు పుణ్యాత్ముడనే, స్వర్గార్హుడవే , కాని నీ వంశీకూడైన సువీరుడనే వాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావాల్సి వచ్చినది. అయినా వ్యక్తిగతంగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదానదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జేవిస్తూ వుంది. ఆ బిడ్డకింకా వివాహాము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై (భూలోక వాసులు గుర్తించే శరీర), అక్కడకు వెళ్ళి, అక్కడ యోగ్యుడైన వరునికి ఇచ్చి, కన్యాదాన విదాముగా పెండ్లిని జరిపించు శత్రుకీర్తీ! ఎవడైతే కార్తీకమాసములో సర్వాలంకార భూషితయైన కన్యను యోగ్యుడైన వరునికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానమును చేయాలనే సంకల్పమును వుండీ కూడా సంతానము లేనివాడు __ బ్రాహ్మణా కన్యాదానికిగాను కన్యాదాం అందుకోబోతూన్న బ్రహ్మణునకుగాని ధన సహాయమును చేసినట్లేయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నీ పొందుతాడు. అంతే కాదు __ స్వలాభాసేక్షా రహితులై రెండు పాడి ఆవులను చెల్లించి, కన్యను కొని, ఆ కన్యను చక్కటి వరుసకిచ్చి పెండ్లి చేసే వారు కూడా కన్యాదన ఫలాన్ని పొందుతారు కాబట్టి, ఓ శత్రుకీర్తీ ! నీవు తక్షణమే భూలోకానికి వెళ్ళి, సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్భాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లే అయితే __ తద్వారా నువ్వూ, నీ పూర్వీకులూ, ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు" అని చెప్పాడు.
ధర్ముని అనుగ్రహము వలన దేహాధరియైన శత్రుకీర్తీ , వెనువెంటనే భూలోకములోని నర్మదా నదీతీరాన్ని చేరి, అక్కడి వర్ణశాలలో వున్న సువీరుని భార్యకు హితవులు గరపి, వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితనుచేసి, శివప్రీతిగా 'శివార్పణమస్తు' అనుకుంటూ ఒకానొక బ్రహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు __ నరకపీడా విముక్తుడై , స్వర్గమును చేరి సుఖింఛసాగాడు. తదన౦తరము శత్రుకీర్తి పదిమంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారాబోయడం వలన వారి వారి పితృపితా మహిదివర్గాల వారంతా కూడా విగతపావులై , స్వర్గాన్ని పొందారు. అనంతరము శత్రుకిర్తీ కూడా యదాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా! కార్తీకమాసములో కన్యాదానము చేసేవాడు, సర్వమూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్ధము మాట సహాయమును చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు రాజా! ఎవరైతే కార్తీక మాసములో యధావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో, వాళ్ళు స్వర్గాన్నీ, ఆచరించని వాళ్ళు నరకాన్నీ పొందుతారనడంలో ఏమాత్రం సందేహము లేదని గుర్తించు.
ఏవం శ్రీస్కాంద పురాణంతర్గత కార్తీక మహాత్మ్యే
త్రయోదశ అధ్యాయం సమాప్తం